ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.దమ్ముందా నీకు? అని నిలదీశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకివచ్చిన 45 రోజుల్లోనే 36 మంది వైసీపీ నాయకులను హత్య చేశారని చెబుతున్న జగన్ను ఉద్దేశించి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. “నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ అనేవి ఉంటే.. ఆ 36 మంది పేర్లు బయట పెట్టు. నేను చర్యలు తీసుకుంటా. లేకపోతే అన్నీ కట్టిపెట్టి తాడేపల్లిలో ఉండు” అని చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
“ఈ పెద్ద మనిషి.. గవర్నర్ దగ్గరకు వెళ్లాడట. రాష్ట్రంలో 36 మంది చచ్చిపోయారని చెప్పాడట. నేను చెబుతున్నా. నీకు సిగ్గుంటే.. ముందు అసెంబ్లీకి రా! వచ్చి ఇక్కడ మాట్లాడు. నీ హయాంలో ఎంత మంది మా వాళ్లను పొట్టన పెట్టుకున్నావో నేను కూడా చెబుతా ఇప్పటికే వారి పేర్లు, ఊర్లు.. అడ్రస్లు సహా నీకు ఇచ్చాం. మళ్లీ ఇస్తాం. ఆ కేసులన్నీ తిరగదోడుతున్నాం. ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. ఇలా ఢిల్లీ వెళ్లి దొంగ ఏడుపులు, నంగి నంగి మాటలు చెప్పడం కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా!” అని సవాల్ రువ్వారు.
చంపినోడెవడు-చచ్చినోడెవడు!
వినుకొండలో జరిగిన దారుణ హత్యపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసలు చంపినోడెవడు? చచ్చినోడెవడు? అని ప్రశ్నించారు. ఇద్దరూ నిన్న మొన్నటి వరకు నీ పార్టీలోనే ఉన్నారా? లేరా? అని జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. “రషీద్ ఇంటికి వెళ్లి దొంగ ఏడుపులు ఏడుస్తాడు. అక్కడికి వెళ్లి మా పథకాల గురించి మాట్లాడతాడు.అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు కానీ నాటకాలు ఆడేందుకు మాత్రం ఉంది. రషీద్ అనేవాడిని చంపిన వాళ్లను అరెస్టు చేశాం” అని చంద్రబాబు తెలిపారు.
నీ ముసుగు తీస్తా..
“జగన్ నీ ముసుగు తీస్తా. నీ బండారం బట్టబయలు చేస్తా. నువ్వు నేరస్తుడివి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావ్. ప్రజాస్వామ్యం అంటే రాజకీయాల ముసుగులో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కాదు. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు. నీ ముసుగు తీస్తా.నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. జాగ్రత్త” అని చంద్రబాబు హెచ్చరించారు.
