ద్రోణ కోటగిరి
ఎస్సీ ఉప కులాల వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ బిల్లును అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం పట్ల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో సంబరాలు చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో శతాబ్దాల నుండి మందకృష్ణ పోరాటం చేసిన ఫలితమే నేడు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్ తీర్పు లక్షల మందికి భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అన్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తాము వెంటనే తెలంగాణలో వర్గీకరణ రిజర్వేషన్లను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం శుభ సూచికమని ఎమ్మార్పీఎస్ నాయకులు వ్యక్తం చేశారు. వర్గీకరణతో ఎంతోమంది పేద మాదిగ ఉప కులాల యువకులకు లబ్ధి చేకూరుతుందని వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు సుంకిని హనుమంతు, దౌలయ్య, మాజీ సర్పంచ్ ఆనంద్, లాలయ్య, సాయిలు, సోంపూర్ పోచిరాం, హనుమంతు, కన్నం పోశెట్టి, పేగులాలయ్య తో పాటుపలువురు పాల్గొన్నారు.
