నిజామాబాద్ ఆగస్ట్ 22 ద్రోణ
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతన్కర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ పటేల్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఆయనకు పార్టీ నాయకులు, బీసీ,ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. గత కమిటీలోను లక్ష్మీనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసినదే. పార్టీ సంస్థాగత నిర్మాణం, క్రియాశీలక పనితీరులో కీలక పాత్ర పోషించారు. పార్టీ తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో చురుగ్గా వ్యవహరించారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం, అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పోరాడి, దాడులను, కేసులను ఎదుర్కొన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేశారు. పార్టీ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కవితపై పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఓ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా పార్టీ బలోపేతానికి, నూతన నాయకుల చేరికలకు కృషి చేశారు. పార్టీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేల, జిల్లా అధ్యక్షుని అభిప్రాయాలను గుర్తెరిగి, పార్టీ పరమైన పనులను చక్కబెట్టడంలో విజయం సాధించారు. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కు నోట్లో నాలుకలా వ్యవహరిస్తూ, కార్యక్రమాల విజయవంతంలో పాలుపంచుకున్నారు. వరుసగా రెండోసారి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన పార్టీకి, తనపై నమ్మకంతో పదవి ఇప్పించిన ఎంపీ అరవింద్ లకు ఈ సందర్భంగా పోతన్కర్ లక్ష్మీనారాయణ కృతఙ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ, ఎంపీ అరవింద్ నమ్మకాన్ని నిలబెడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. కమర్షియల్ టాక్స్ అధికారిగా పని చేస్తున్న సమయంలో, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, ప్రధాని మోదీ పరిపాలన దక్షతకు ముగ్ధుడై, ఎంపీ అరవింద్ చేస్తున్న అభివృద్ధిని చూసి, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాషాయం కండువా కప్పుకున్నట్టు పేర్కొన్నారు. తన నిబద్ధతను గుర్తించి, పార్టీ పదవి కట్టబెట్టడాన్ని జీవితంలో మర్చిపోలేనని సంతోషం వ్యక్తం చేశారు.
