కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
సాలూర తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 16 ద్రోణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట వెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను తహసీల్దార్ శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలుపాలని అన్నారు.
ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్.ఐ.ఆర్ ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

