లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యే, కలెక్టర్
బోధన్ అక్టోబర్ 25 ద్రోణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జైతాపూర్ గ్రామస్థులను ఆదర్శంగా తీసుకొని తన నియోజకవర్గంలో పేదలందరూ ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించుకుంటే అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను బోధన్ శాసన సభ్యులు, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ, వారిచే గృహ ప్రవేశాలు చేయించారు. తమ సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతఙ్ఞతలు తెలియజేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని మిగతా లబ్దిదారులు కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. పేదలకు అన్ని సదుపాయాలతో కూడిన సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల నిధులు అందిస్తోందని అన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తున్నామని, ఐ.కె.పి, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరు చేయిస్తున్నారని గుర్తు చేశారు. ఈ తోడ్పాటును అందిపుచ్చుకుని తన నియోజకవర్గంలోని జైతాపూర్ గ్రామంలో పది మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకున్నారని, మరి 60 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని హర్షం వెలిబుచ్చారు. కాగా, గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి విద్యుత్ వసతి, మహిళా శక్తి భవనాలకు టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.











