బోధన్, నవంబర్ 05 ద్రోణ
డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదు అది ఒక గొప్ప బాధ్యతని ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో బుధవారం డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికుల సురక్షిత ప్రయాణం వంటి అంశాలపై అధికారులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణం అమూల్యమని, ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో ప్రాణ నష్టాలకు దారి తీస్తుందన్నారు. ప్రతి డ్రైవర్ బయలుదేరే ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని, వేగ పరిమితిని కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి ప్రయాణాలకు ముందు తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆమె హితవు పలికారు. డ్రైవింగ్లో క్రమశిక్షణ, ఓర్పు, జాగ్రత్త అనేవి ప్రతి డ్రైవర్ లక్షణాలుగా ఉండాలన్నారు. డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వాహనాలు సరిగా తనిఖీ చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తుందని, అందుకే ప్రతీ షిఫ్ట్కి ముందు టెక్నికల్ చెకింగ్ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్–2 డిపో మేనేజర్ సాయన్న, జేబీఎస్ డీఎం రవితేజ, సూపరింటెండెంట్ తదితర అధికారులు పాల్గొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ఆసక్తిగా సదస్సులో పాల్గొని భద్రతా నియమాలపై అవగాహన పొందారు.
