ద్రోణ,నిజామాబాద్, జనవరి 30
మున్సిపల్ ఎన్నికల వేళ విధి నిర్వహణలో తీరిక లేని విధంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ, తనను కలిసేందుకు వచ్చిన విద్యార్థినుల కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఆప్యాయంగా పలకరించి చాక్లెట్లు పంచి పెట్టారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అయితే, కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జిల్లా పాలనాధికారిని కలిసేందుకు కళాశాల వద్దకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో వారిని గమనించిన కలెక్టర్, బాలికలను తన వద్దకు పిలిపించుకుని ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. చక్కగా చదువుకోవాలని హితవు పలుకుతూ, వారికి చాక్లెట్లు అందించారు. జిల్లా పాలనాధికారిని నేరుగా కలిసిన క్షణాలను విద్యార్థినులు ఆస్వాదిస్తూ, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.





