ద్రోణ,నిజామాబాద్, జనవరి 30
మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14′ 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసు, బోధన్, ఆర్మూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, భీంగల్ మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై అధికారులతో చర్చించి, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. టీ పోల్ యాప్ లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ వెంట బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.

