బోధన్ పట్టణంలో గురువారం ఆర్టిసి మరియు ప్రైవేట్ డ్రైవర్లకు కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు.లయన్స్ క్లబ్ బోధన్ వారి సహకారంతో అంబులెన్స్, ఆర్టీసీ, స్కూల్ బస్సు మరియు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కంటి మరియు చెవి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు డా. బెనిట జాన్, ఆడియాలజిస్ట్ డా. బిపిన్ డ్రైవర్లకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి కంటి చూపు, వినికిడి సరిగా ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధి భశ్వేశ్వర్ రావు, విద్యావికాస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 100 మంది డ్రైవర్లు ఈ వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు.




