Saturday, March 7, 2026

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూర చెక్ పోస్ట్

ప్రారంభించిన టీ.జి.ఎం.డీ.సీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా

ద్రోణ,నిజామాబాద్, మార్చి 07

పొరుగు రాష్ట్రాల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ పకడ్బందీ చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని సాలూర వద్ద టీ.జీ.ఎం.డీ.సీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను నెలకొల్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా చెక్ పోస్ట్ ను శనివారం లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద వేయింగ్ మెషిన్ తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు, ఓవర్ లోడింగ్ ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలిగిందని ఎం.డీ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించవచ్చని, అయితే సాలూర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకు చెక్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇసుక రవాణా విషయంలో పలు అక్రమాలు జరిగేవని, ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్ లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెడిపోకుండా, రోడ్డు ప్రమాద సంఘటనలు జరుగకుండా నిలువరించవచ్చని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ కు సమీపంలోనే మహారాష్ట్ర ఇసుక క్వారీలు ఉన్నందున ఇసుక అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుక లభ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంజీరాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వకం, రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎం.డీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్ పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏ.డీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏ.డీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular