శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
ద్రోణ,నిజామాబాద్, ఏప్రిల్ 24
అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మాణం చేపట్టబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయం స్థలం సందర్శించారు. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళ నిర్మాణానికి ఈ స్థలాన్ని ఖరారు చేసినందున, శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభించి, నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే మంజూరీ తెలుపబడిన బోధన్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీ.ఈ రాందాస్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.




