Tuesday, June 23, 2026

అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ స్కూల్స్

ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడి*

ద్రోణ,నిజామాబాద్, జూన్ 23

విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బోధన్ నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కాగా, అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదల్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్ రూమ్ లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్.ఓ ప్లాంట్, బోర్ వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకం అయ్యారు. పలు ప్రశ్నలు వేస్తూ, విద్యార్థులు సామర్ధ్యాన్ని పరీక్షించారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు చాక్లెట్లు, బహుమతులు అందించి ప్రోత్సహించారు. వీరి వెంట జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular