వ్యవసాయ శాఖ రైతులకు హెచ్చరిక
కోటగిరి, ద్రోణ జులై 20
పంటల సాగులో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్ష బావ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని పోతంగల్ వ్యవసాయ అధికారిని రైతులకు సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోతంగల్ మండలంలోని రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు.
అధిక నీటి అవసరం ఉన్న వరి వంటి పంటల సాగు విస్తీర్ణాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. తక్కువ నీటితో మంచి దిగుబడిని ఇచ్చే కందులుమొక్కజొన్న,పత్తి, చిరుధాన్యాలు (జొన్న, సజ్జ, కొర్ర, సామలు, అరికెలు మొదలైనవి) సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.
రైతులు తమ భూమిలో తేమను సంరక్షించేందుకు అంతర దుక్కులు, కలుపు నివారణ, వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన అధిక దిగుబడి, తక్కువ కాల వ్యవధి గల విత్తన రకాలను మాత్రమే ఉపయోగించాలని కోరారు.
పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు సాంకేతికతపై మరింత సమాచారం కోసం రైతులు సమీప రైతు వేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా పోతంగల్ మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఆమె వెంట హెగ్డోలి సర్పంచ్ నాగరాజు, రైతుల అర్జున్, ఏ ఈ ఓ శంకర్ తదితరులు ఉన్నారు.
