నిజామాబాద్, జూలై 30,ద్రోణ
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించడం జరుగుతుందని అన్నారు. భారీ వర్ష సూచనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే, కలెక్టరేట్ లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 – 220183 కు సమాచారం అందించాలని ఒక ప్రకటనలో కోరారు.
