నిజామాబాదు అటవీ భూముల ఆక్రమణాల నివారణ , తొలగింపులపై పోలీసు శాఖ – అటవీశాఖ అధికారుల సమన్వయ సమావేశం
నిజామాబాద్ ఆగస్టు 6 ద్రోణ
నిజామాబాదు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలను సమర్థవంతంగా అరికట్టడం , ఇప్పటికే జరిగిన ఆక్రమణలను చట్టపరంగా తొలగించడం , అటవీ సంపదను సంరక్షించడం , పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సమన్వయ చర్యలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా భావించాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ హాల్లో పోలీసు శాఖ మరియు అటవీశాఖ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. సిపి,జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. పోలీసు శాఖ , అటవీశాఖకు చెందిన ఉన్నతాధికారులు , డివిజనల్ అధికారులు , ఫీల్డ్ స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అటవీ భూముల ఆక్రమణలు ప్రభుత్వ ఆస్తికి , పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించే అంశమని పేర్కొన్నారు. అటవీ భూములపై ఎటువంటి అక్రమ ఆక్రమణలు , అక్రమ నిర్మాణాలు , భూమి మార్పిడి , చెట్ల నరికివేత , అక్రమ మైనింగ్ , కలప రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్ , డ్రోన్ సర్వేలు , క్రమానుగత తనిఖీలు , ఆక్రమణలకు సంబంధించిన ఆధారాల సేకరణ అనునిత్యం సేకరించి తగు చర్యలు తీసుకోవాలి.
ఇటువంటి ఘటనలపై సమాచారం అందిన వెంటనే పోలీసు శాఖ , అటవీశాఖ అధికారులు సంయుక్తంగా స్పందించి చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ అటవీ భూములను రక్షించడం ప్రతి ప్రభుత్వ శాఖతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, కేసుల నమోదు, కోర్టు వ్యవహారాల్లో సమన్వయం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
1) అటవీ భూములపై ఉన్న ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగించేందుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం.
2) ఆక్రమణలు, అక్రమ చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం.
3) పోలీసు శాఖ మరియు అటవీశాఖల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేసి తక్షణ స్పందన వ్యవస్థను బలోపేతం చేయడం.
4) అవసరమైన ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడం.
5) అటవీ భూముల రక్షణలో డ్రోన్లు, జీపీఎస్ మ్యాపింగ్, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం.
6) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం.
7) ప్రజల్లో అటవీ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సహకారాన్ని పెంపొందించడం.
8) సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టి కొత్త ఆక్రమణలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం.
సమావేశం అనంతరం రెండు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అటవీ భూములను సంపూర్ణంగా రక్షించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ఈ సమావేశం లో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ , ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్ర శేఖర్ రావు , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్ , వెంకటేశ్వర రెడ్డి , శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్ మరియు పోలీసు శాఖ నుండి సిఐలు , ఎస్సైలు మరియు ఫారెస్ట్ శాఖ నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.



