కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తన నివాసంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం తలంబ్రాల బియ్యం నెత్తిన ఎత్తుకొని, శ్రీరామ నామ మంత్ర జపం మధ్య భక్తులతో కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల మధ్య అర్చకులు శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణంలో మొదటగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, మధుపర్కం, జీలకర్ర బెల్లం, సుముహూర్తం, మాంగల్య పూజ, ధారణ, తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ మొదలగు వైదిక క్రతువులను అర్చకులు నిర్వహించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అనంతరం మంత్రి ప్రసంగిస్తూసీతారాముల ఆశీస్సులతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, మంథని నియోజక వర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ,సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి కష్టాలు రాకుండా స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రతినిత్యం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో నిత్య పూజలు, భజనలు చేస్తూ నిరంతరం ప్రజలు బాగుండాలని కోరుకుంటున్న పండితులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాముడు ధర్మాన్ని నమ్ముకుని ఆ కాలంలో తన రాజ్య పాలన చేశాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించిన, ధర్మాన్ని నమ్ముకుని రాముడు ముందుకు నడిచాడని అన్నారు. రాములవారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్దామని సూచించారు.రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగా పండాలని, రైతుల కష్టాలను తొలగించే విధంగా ఒక యాగం చేపట్టాలని పురోహితులను కోరారు.ఈ కళ్యాణం కొరకు తమ వంతుగా ముందుకు వచ్చిన వారందరికీ శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.ఎలాంటి కష్టం వచ్చినా భరించే శక్తిని అందరికీ ఆ రాముడు ఇవ్వాలని అన్నారు.ధన్వాడలో మీ అందరి సమక్షంలో రాముల వారి కళ్యాణం చేయాలని మా అమ్మ సంకల్పం.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భక్తులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
రాముని పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దాం
RELATED ARTICLES
