ద్రోణ హైదరాబాద్
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రూ. లక్షలోపు ఉన్న అన్నదాతల అకౌంట్లో గురువారం సాయంత్రంలోపు డబ్బులు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు రుణాలున్నాయని,వారిలో 6.36లక్షల మందికి రేషన్ కార్డులు లేవని తెలిపారు. అయినా కూడా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని సీఎం క్లారిటీ ఇచ్చారు. రైతులకు రేషన్ కార్డులు లేకున్నా సరే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని బ్యాంకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగనివ్వకూడదన్నారు. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని..కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డ్ నిబంధన విధించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు లక్ష వరకురుణమాఫీ నిధులను రైతుల అకౌంట్లోకి జమ అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు గురువారం రైతుల అకౌంట్లో నగదు జమ అయిన తర్వాత రుణమాఫీ లబ్దిదారులతో సంబురాల జరపాలని..వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
