ద్రోణ జుక్కల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రోజుల “స్వచ్ఛధనం – పచ్చధనం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. జుక్కల్ మండల కేంద్రంలో మొక్కలు నాటి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం నుండి 9 వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
జుక్కల్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు, అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు.ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు.
పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.
ప్రజా ప్రతినిధులతో పాటు, యువజన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.వన మహోత్సవం ద్వారా ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలన్నారు.మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛధనం పచ్చధనం దోహదపడుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కుక్కల పట్ల ప్రజల అప్రమంతంగా ఉండాలి
గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరిగే కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఎంతో మంది కుక్కల కాటు గురై ఇబ్బందులు పాలు అయ్యారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అనంతరం మండల కేంద్రంలోని పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు.
