శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు స్పష్టం చేశారు.బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నదని కొనియాడారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగష్టు లోపు రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు అన్నీ మాఫీ చేస్తున్నామని, రైతుల పట్ల ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం హర్షించదగ్గ విషమని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులు, దళితుల పక్షపాతిగా ఉంటుందని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన ఎనిమిది నెలల్లో దాదాపు మూడు నెలలు ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండడం వల్ల కొన్ని పనులు తాత్కాలికంగా నిలిచి పోవడం జరిగిందని, మళ్లీ ఇప్పుడిప్పుడే అన్ని పనులు మొదలుపెట్టామని తెలిపారు.
గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయకపోగా..
కాంట్రాక్టర్లను అధిక కమీషన్ల కోసం ఇబ్బందులు పెట్టడం వల్ల ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదంటే అది కేవలం హన్మంత్ షిండే నిర్లక్ష్యం,అసమర్థతే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటించారు..
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ప్రతిభ అనే క్రీడాకారిణికి ప్రోత్సాహం అందిచాలని అసెంబ్లీలో తాను ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేస్తూ..
జుక్కల్ నియోజకవర్గంలో ఎటువంటి క్రీడా సౌకర్యాలు లేవనే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తాం
RELATED ARTICLES
