భూపాలపల్లిలో కలెక్టర్ తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ద్రోణ భూపాలపల్లి ఆగస్టు 9
మొక్కలు పెంచడం వల్ల సహజంగానే ప్రకృతి వరప్రసాదంగా మనమంతా ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పొందవచ్చు అంటూ స్వచ్ఛదనం – పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఉదయం భూపాలపల్లి పట్టణంలోని ఎల్బి నగర్(18,19 వార్డులు)లో నిర్వహించిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటి, నీరు పోశారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని, పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు, పట్టణాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద, పాఠశాలల చుట్టుపక్కల, కార్యాలయాల వద్ద, పొలాల వద్ద, ఖాళీ స్థలాలల్లో, రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు వర్షాలు విరివిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.అనంతరం భూపాలపల్లి మొయిన్ రోడ్డు నుండి వంద పడకల ఆసుపత్రికి వెళ్ళే రోడ్డు ను ఇటీవల రూ.30 లక్షలతో సీసీ రోడ్డు వేయగా, అట్టి రోడ్డును ఎమ్మెల్యే శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
