Sunday, February 15, 2026

మత్స్యకార్మికులకు మెరుగైన ఉపాధి కోసం నాణ్యమైన చేప పిల్లల పెంపకం

శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడి

నిజామాబాద్ ద్రోణ ప్రతిని :-

అక్టోబర్ 08:-

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ తో కలిసి అశోక్ సాగర్ లో చేప పిల్లలను వదిలారు. మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.

మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 – 2025 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి, బరువును తూకం వేస్తూ, ఒక్కోటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు.

ఈ చెరువులో మొత్తం 57300 చేప పిల్లలు విడుదల చేయగా, అందులో బొచ్చ రకం 22920, రోహు రకం 28650 , బంగారు తీగ జాతికి చెందిన చేప పిల్లలు 5730 ఉన్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.27 కోట్ల చేప పిల్లలు చెరువులలో వదలడం జరుగుతోందన్నారు. .ప్రతి చోట చెరువులు, ఇతర జలాశయాలలో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ఎమ్మెల్యే హితవు పలికారు.

నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే చేప పిల్లలు కేటాయించబడినాయా? లేదా? అన్నది జాగ్రత్తగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఎక్కడైనా తేడా జరిగినా, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఉన్నా, వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. చెరువులలో వదులుతున్న ప్రతి చేప పిల్ల బతికేలా నాణ్యమైన చేప విత్తనాలను ఉత్త్పత్తి చేయిస్తున్నామని అన్నారు. నాణ్యమైన చేప పిల్లలను పెంచినట్లయితే మత్స్యకారుల ఉపాధి అవకాశాలు బాగుంటాయని ఉద్దేశ్యంతో అన్ని దశలలోనూ పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, ఒకే విడతలో అన్ని చేప పిల్లలను తెచ్చి వాటి నాణ్యతను సమగ్రంగా పరిశీలిస్తూ చెరువులలో వదిలేందుకు ఎక్కువ సమయం పడుతుందని, దీనివల్ల కొన్ని చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు విడతలుగా చేప పిల్లలను చెరువుల వద్దకు తరలిస్తూ వాటి నాణ్యత ప్రమాణాలను సంఘాల బాధ్యులు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట చెరువులలో విడుదల చేస్తే బాగుటుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు.

ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న అశోక్ సాగర్ చెరువు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని, వివిధ చెరువులలో చెప్పక పెంపకానికి అవరోధంగా మారిన గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్,మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయ స్వామి, మత్య్స కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular