ద్రోణ కామారెడ్డి
విద్యార్థుల టిఫిన్ కోసం విద్యార్థులతోనే పూరీలు చేయిస్తారా వాటిని చేసేందుకు వంట మనుషులు లేరా అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాఠశాల సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండలం జంగంపల్లి బిక్నూర్ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందు మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేశారు. చదువుకునే విద్యార్థులే పూరీలు చేస్తూ ఉండడాన్ని చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది లేరా అంటూ ప్రశ్నిస్తూనే పిల్లలతో టిఫిన్లు చేయిస్తారా అంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. మళ్లీ ఇలా విద్యార్థులతో పనులు చేయిస్తే సహించేది లేదని అన్నారు. భోజనం బాగా పెడుతున్నారా అంటూ విద్యార్థులను ప్రశ్నించగా బాగానే పెడుతున్నారంటూ విద్యార్థులు తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల ను సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా మౌలిక వసతులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగానే ఉన్నాయంటూ పాఠశాల విద్యార్థులు సమాధానం ఇచ్చారు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాలలోని వంటగది తో పాటు పరిసరాలను పరిశీలించారు.
