న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్……….
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. జిల్లాకోర్టు బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు కు నివాళి అర్పించి,కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు.హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రబాపు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జగన్ కోరారు.దేశ,రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో శాసనసభ లో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం దాల్చడానికి సహకరించాలని జగన్ కోరారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావ్, ఉపాధ్యక్షులు పెండం రాజు, దొంపల్ సురేష్, కార్యదర్శి ఏ దీపక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్, న్యాయవాదులు విఘ్నేష్, పడేగేల వెంకటేశ్వర్, బిట్లా రవి, పిల్లి శ్రీకాంత్, ప్రీమ్ కుమార్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
