నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా పోచారం
ద్రోణ బోధన్ ప్రతినిధి
బాన్సువాడ నియోజకవర్గం లో ఏ గ్రామానికి చెందిన వారైనా పేదలు ఇల్లు నేర్పించుకునేందుకు ముందుకు వస్తే వారికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయిస్తానని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయించామని, ఆనాడు కూడా పార్టీలకు అతీతంగా పేదలకు గృహాలను మంజూరు చేయించామని, నేడు కూడా పార్టీలకు అతీతంగా తన నియోజకవర్గంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని, బాన్సువాడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దరమే తన అంతిమ లక్ష్యం అని పోచారం స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిరుపేదలు ఎవరు అపోహలు చెందవద్దని, గ్రామాల్లో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు రాకపోతే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. గతంలో నిర్మించుకున్న కొందరికి కొన్ని బిల్లులు ప్రభుత్వ నుండి చెల్లించాల్సి ఉందని వారికి కూడా తొందరలో బిల్లులు చెల్లించే విధంగా కృషి చేస్తానన్నారు.వర్ని మండల కేంద్రం సి సి డి ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పోచారం లబ్ధి దారులకు సూచనలు సలహాలు అందించారు. వర్ని, చందూర్, మోస్రా, రుద్రుర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పోచారం మరియు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదగా అందించారు.
వర్ని మండలంకు 425, చందూర్ మండలం కు 94, మోస్రా మండలంకు 96, రుద్రూర్ మండలంకు 188 గృహాలు మంజూరు చేశామని లబ్ధిదారులకు వాటి మంజూరు పత్రాలను అందించారు. మొత్తం 803 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు.









