సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్,ద్రోణ జూలై 09
బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బుధవారం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, భూభారతి అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తూ, త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. పేద కుటుంబాలకు సొంత ఇంటిని కల్పించేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకం అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా వ్యవహరించాలన్నారు. లబ్దిదారులు అందరు ఇంటి నిర్మాణం చేపట్టేలా తోడ్పాటును అందిస్తూ ప్రోత్సహించాలని సూచించారు. ఆర్ధిక స్థోమత లేని వారికి ఐకేపీ, మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తూ, ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. అదేవిధంగా అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కొత్తగా పేర్ల నమోదు, తొలగింపు కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మంజూరు చేయాలని సూచించారు. మీసేవ కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే అధికముగా వసూలు చేయకుండా చూడాలన్నారు. ఎవరైనా నిర్ణీత రుసుముకంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ , బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

