Tuesday, February 17, 2026

ఈడి సిబిఐ పేరిట బెదిరింపులు

హైదరాబాద్‌ బ్యూరో : గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్‌ చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు, చార్జిషీట్, విచారణ లేకుండానే విపక్ష నేతలను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి నేతల పరిస్థితే ఇలాఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా సంస్థలను కూడా బెదిరించారని ఆక్షేపించారు. 
‘‘ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను పంపించి బెదిరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్‌ పెట్టి పరిస్థితి ఎలా ఉందో వివరించారు. భాజపా పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగింది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ, అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగుచట్టాలు తెచ్చారు. కొన్ని నెలలపాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక వాటిని రద్దు చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయలేదు. అగ్నివీర్‌ పథకం దేశ రక్షణకు ప్రమాదకరం. గతంలో ఏ ప్రధాని కూడా మోదీ అంతలా దిగజారి మాట్లాడలేదు. పదేళ్లలో ఏం చేశారో చెప్పడం లేదు. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పటం లేదు. మోదీ సర్కార్‌ తెలుగు రాష్ట్రాలకు గత పదేళ్లుగా ఇచ్చిందేమీ లేదు. తెలంగాణ, ఏపీ మధ్య బుల్లెట్ రైలు ఉండాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరాను. అసలు దాని గురించి ప్రస్తావనే లేదు. భాజపా నేతలకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత  కూడా లేదు’’ అని ఉత్తమ్ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular