ద్రోణ తెలంగాణ స్టేట్ బ్యూరో
మే 12: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ – విజయవాడ రూట్లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు తెలిపారు. ఆయా బస్సుల్లో దాదాపు మూడు వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు. టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్ను సంప్రదించాలన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోందన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
