ద్రోణ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా బ్యూరో
ధాన్యం కొనుగోలు లో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జుక్కల్ నియోజకవర్గంలోని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే బాధ్యత తనదేనని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో వరి పంటను రైతులు ఆలస్యంగా సాగు చేస్తారు. ఇతర ప్రాంతాల రైతులు నెల రోజులు ముందస్తుగా వరి పంట సాగు చేయడంతో ఆ ఏరియాలలో వరి పంట ముందస్తుగా చేతికి అందింది. జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని రైస్ మిల్లులో గోడౌన్లు ఖాళీ లేక మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేపట్టలేమని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తాను రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా మిల్లర్లు ధాన్యం సేకరణకు సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. నిజాంసాగర్, మహమ్మద్ నగర్, పిట్లం మండలంలోని ధాన్యం సేకరణలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టంగా రైతులకు హామీ ఇచ్చారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే బాధ్యత మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా రైతుల సమస్యలను పరిష్కరించి ప్రజల్లో ఆదరణ పొందడంతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మరోపక్క ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇప్పటికే అందజేయడం జరిగిందన్నారు. మరోపక్క ఆగస్టు 15 లోపు రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక టిఆర్ఎస్ నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తుందని, భవిష్యత్తులో వారి నాటకాలు ఇక సాగవని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, నియోజకవర్గ ప్రజల కష్టాల్లో తాను పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
