భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద నుండి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ గాలానికి చిక్కింది. ట్రాన్స్ కో అవినీతి చేప.వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పట్టణానికి చెందిన కొనకళ్ల ఆదిత్య అనే రైతు అదే మండలంలోని మద్దికొండ గ్రామంలో తన ఐదెకరాల వ్యవసాయ భూములో విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు అశ్వరావుపేట సబ్ స్టేషన్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న శరత్ కుమార్ ని కలవగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.లక్ష రూపాయలు తాను ఇవ్వలేనని అధికారికంగా చెల్లించవలసిన నగదు చెల్లిస్తానని,తనకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు కోరారు.దానికి ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ ససేమిరా అనడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రైతు ఆదిత్య అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు.
రైతు వద్ద నుండి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఏఈ శరత్ కుమార్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. రైతు ఆదిత్య లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని సబ్ స్టేషన్ లో ఏఈ ఆఫీస్ లో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తమను సంప్రదించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వడం కూడా నేరమేనని,ఏసీబీ శాఖ పనిచేస్తుందని,ఎవరు లంచం డిమాండ్ చేసిన తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ అధికారి
RELATED ARTICLES
