Wednesday, February 18, 2026

తెలుగు రాష్ట్రాలకు కుండబపోతే వచ్చే 5 రోజులు భారీ వర్షాలు

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణశాఖ. రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో ఐదు రోజులపాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది.అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం. నైరుతి రుతుపవనాలు ఈనెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడటం కారణంగా.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. గంటకు 40 నుంచి50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తెలిపింది వాతావరణశాఖ.

తెలంగాణలోను వచ్చే 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబనగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణశాఖ.18 నుంచి 20 వరకు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్‌ అయింది. అధికారులతో మేయర్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
మరోవైపు నైరుతి పవనాల విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి పవనాలు ఈ నెలాఖరుకు కాస్త అటూ ఇటూ ప్రవేశించవచ్చని ప్రకటించింది. ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది నైరుతి తీవ్రంగా నిరాశపర్చింది. వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అనేక వర్గాల్లో సంతోషాన్ని నింపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular