ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో మృతదేహం లభ్యం కావడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత పది రోజులుగా అవే నీళ్లు తాగుతుండటంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తాగునీరు తేడాగా అనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానికులు వాటర్ ట్యాంక్ను పరిశీలించగా అందులో వ్యక్తి మృతదేహం కనిపించింది. నీళ్లు అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిబ్బందిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నాగార్జున సాగర్లోని మంచినీటి ట్యాంక్లో 30 కోతులు పడి చనిపోయిన ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో సంబంధిత అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నల్గొండలోని హనుమాన్నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీ ఈ నెల 24న అదృశ్యమై.. ఈ వాటర్ ట్యాంక్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారించే బాధ్యతను అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు.
