ద్రోణ అమరావతి ప్రతినిధి
విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆదివారం తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. పొంగళ్ళు చేసి నెత్తిన పెట్టుకొని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు,రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు.ఈ పాదయాత్ర లో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు.2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించడం అదే విధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీస్ లను మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులు పై విరుచుకుపడడం జరిగింది. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పున ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
