గుండెపోటుతో తుదిశ్వాస
విడిచిన డీఎస్
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్ కండువా సొంత గూటికి చేరిపోయారు. డీఎస్కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ పనిచేశారు
1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్.. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి డీఎస్, తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన డీఎస్ సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
