ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
భర్తీకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ 3035 ఉద్యోగాలలో
డ్రైవర్ – 2000,
శ్రామిక్ – 743, ,
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్) – 114,
డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) – 84,
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,
అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23 ,
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15 ,
సెక్షన్ ఆఫీసర్(సివిల్) – 11 ,
— మెడికల్ ఆఫీసర్(జనరల్) – 7, మెడికల్
ఆఫీసర్(స్పెషాలిస్ట్) – 7 కొలువులు ఉన్నాయి.
ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని అన్నారు. ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
