మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
ద్రోణ హైదరాబాద్:
ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలకమైన వ్యక్తిగా మారారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహచరులు కాబట్టి ఈ సమావేశంలో విభజన అంశాలు కొలిక్కి వస్తాయని అందరూ అనుకుంటున్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలని తానూ కోరుకుంటున్నట్లు గౌడ్ చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..” ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10సంవత్సరాలైంది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఏడు మండలాలను కలపకపోతే సీఎంగా బాధ్యతలు తీసుకోనని ప్రధాని మోడీకి అప్పట్లో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడయినా మా మండలాలను మాకు ఇవ్వాలి. కృష్ణా, గోదావరి నదులపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇరురాష్ట్రాలకు చెందిన ఆస్తుల పంపిణీ అంశం పరిష్కరించాలని కోరుతున్నా. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. వాటిని తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలి. మేము విజయవాడలో గుంట జాగా అడుగుతున్నామా, తిరుపతిలో వాటా ఇవ్వమంటున్నామా?. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య మళ్లీ విభేదాలు లేకుండా ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించాలి” అని అన్నారు.
