Thursday, February 26, 2026

వైద్య విద్యార్థులు మోసపోవద్దు

ద్రోణ దిల్లీ

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్‌లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్‌ఎంజీఈ’ అర్హత పరీక్ష జులై 6న నిర్వహించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్‌ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ వెల్లడించింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలని, కేవలం డబ్బుల కోసమే కొందరు అటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం ఇంకా రూపొందించే దశలోనే ఉందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో సేవలందించాలంటే ‘ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE)లో తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జులై 6న దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, నగదు చెల్లిస్తే ఈ పరీక్షా ప్రశ్నాపత్రం అందజేస్తామంటూ సోషల్‌ మీడియాలో వస్తోన్న ప్రచారంపై ఎన్‌బీఈ స్పందించింది. తప్పుదారి పట్టించే ఇటువంటి ప్రకటనలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఎవరైనా ఇటువంటి చర్యల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామ్యమైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ తరహా దుష్ర్పచారానికి సంబంధించి కేరళలో ఇప్పటికే ఓ కేసు కూడా నమోదైనట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular