ద్రోణ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రుల భేటీ సానుకూలంగా సాగిందానే చెప్పుకోవచ్చు. భౌగోళికంగా వేరైనా మానసికంగా ఇరు రాష్ట్రాల ప్రజలు ఒకటేనని ఐకమత్యంగా ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి కొనసాగుతుందన్న భావనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ప్రధానంగా చర్చించిన అంశాలివే.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
పెండింగ్ విద్యుత్తు బిల్లులు
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు.
ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
హైదరాబాద్లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశం.
లేబర్ సెస్ పంపకాలు
ఉద్యోగుల విభజన అంశాలు
