ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి క్యూకడుతున్నారు. దీంతో ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసేందుకు హస్తం పార్టీ తన ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలనే ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో పూర్వవైభవం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడుతుందంటూ కార్యకర్తలనుద్దేశించి సందేశించారు.
