ద్రోణ బెంగళూరు
కర్ణాటకలో భాజపా ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో ముందుప్రియులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఈ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కర్ణాటక మాజీ మంత్రి, భాజపా నేత కె.సుధాకర్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్ నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మద్దతుదారులు.. ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడ్డారు. భారీ ‘క్యూ’ లైను ఉండగా.. ఆ తతంగాన్నంతా పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. భాజపాపై మండిపడ్డారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనని ఆరోపించిన ఆయన.. దీనిపై జేపీ నడ్డా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయం తర్వాత అని, తొలుత కాషాయ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం వస్తోందో ఎదురు చూద్దామన్నారు.
