ద్రోణ నిజామాబాద్ బ్యూరో
సాధారణ బదిలీలలో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించకపోవడంతో వందలాది మంది లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా అధ్యాపక సంఘాలు జీరో సర్వీసులో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్న తమను ఇంటికి దగ్గరగా పంపించాలని కలిసిన వారి కల్లా వేడుకుంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ అధ్యాపకులకు కనీసం రిక్వెస్ట్ బదిలీకే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలాల్లో దాదాపు 15 సంవత్సరాల నుండి లెక్చరర్లు కాంట్రాక్టు పద్ధతిపై ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. 3500 మంది లెక్చరర్ లను గత ప్రభుత్వం వారి సర్వీస్లని రెగ్యులరైజ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో తమకు అవకాశం ఇవ్వాలని లెక్చరర్లు కోరుతున్నారు.

కొందరు అనారోగ్య సమస్యలతో బాధ పడుతు న్నారు. మరికొందరు తల్లి తండ్రి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం మీకు రెండేళ్ల సర్వీసు లేదని చెబుతూ ఈ బదిలీలలో వీరికి అవకాశం కల్పించడం లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కనీసం రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యాపకుల కుటుంబాలు కోరుతున్నాయి. ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నప్పటికీ మా సమస్య ఆయన దృష్టికి వెళ్ళ లేక పోతుందని అధ్యాపకులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వాలు జీరో సర్వీస్ క్రింద బదిలీలు ఇచ్చిందని కానీ నేడు అధికారులు అవకాశం ఇవ్వక పోవడం ఎంతవరకు సమంజసమని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
